Telugu govt jobs   »   Study Material   »   Land Reforms Laws Implementation Drawbacks

Land Reforms Laws Implementation and Drawbacks, Download PDF | భూసంస్కరణ చట్టాల అమలు మరియు లోపాలు

Land Reforms Laws Implementation – Drawbacks: Land reforms bring about social justice. Agriculture is a subject in the list of State Govt. Different states have implemented land reform laws at different stages. But they are not all the same. Although the National Council for Land Reforms was established in 2008 to consolidate, the desired result was not achieved.

భూసంస్కరణ చట్టాల అమలు – లోపాలు: పేదరికం, నిరుద్యోగితను నిర్మూలించి బలహీన వర్గాలను ఆదుకోవడాన్ని సాంఘిక న్యాయం అంటారు. ఆదాయం, సంపద వినియోగాల్లో ఉండే అసమానతలను తగ్గించడమూ అందులో భాగమే. భూ సంస్కరణల వల్ల సాంఘిక న్యాయం జరుగుతుంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. వివిధ రాష్ట్రాలు భూ సంస్కరణ చట్టాలను వివిధ స్థాయుల్లో అమలు పరిచాయి. కానీ అవన్నీ ఒకే రకంగా లేవు. ఏకీకృతం చేయడానికి  జాతీయ భూ సంస్కరణల మండలిని (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ల్యాండ్‌ రిఫార్మ్స్‌) 2008లో స్థాపించినప్పటికీ ఆశించిన ఫలితం అందలేదు.

1991 నుంచి అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణల కారణంగా భూ సంస్కరణల అంశం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. సరళీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపలేదు. 9వ పంచవర్ష ప్రణాళిక (1997-2002) ముగిసే నాటికి కూడా భూ గరిష్ఠ పరిమితి చట్టంలో ఎలాంటి మార్పు లేదు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో కౌలు సంస్కరణలు కొత్త సమస్యలను సృష్టించాయి. అప్రకటిత/రాతపూర్వకం కాని విధానం పెరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక (2002-07) వ్యవసాయ వాణిజ్యీకరణ, వ్యవసాయ భూముల లీజు, భాటకాన్ని మార్కెట్‌ నిర్ణయించే ప్రస్థానాన్ని వేగవంతం చేసింది. ఈ ప్రణాళికా కాలంలో పూర్వపు భూసంస్కరణలు, వాటి లక్ష్యాలకు ప్రాధాన్యం తగ్గింది. నోబెల్‌ బహుమతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్‌ ప్రకారం ఆర్థిక సంస్కరణల ఫలితాలు అందరికీ అందాలంటే భూ సంస్కరణలు అమలు జరగాలి.

Indian Navy Agniveer Admit Card 2022 released, Download Now |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Land Reform Laws in India (భారతదేశంలో భూసంస్కరణ చట్టాలు)

ఏ దేశంలోనైనా భూమి ముఖ్యంగా వ్యవసాయ యోగ్యమైన భూమిపై అందరికీ హక్కు కల్పించడం సమానత్వ సూత్రానికి ప్రాతిపదిక అవుతుంది. భూ యాజమాన్యం కొంత మందికి మాత్రమే పరిమితమైతే భూమి లేనివారు (పేదలు, కూలీలు, ఇతర బలహీన వర్గాలు) భూస్వామ్య వర్గాలపై తిరుగుబాటు చేసినట్లు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సామాజిక సమానత్వం పాటించే ఎక్కువ మందికి కనిష్ఠ స్థాయి కమతాలపై హక్కులు కల్పించడానికి భూసంస్కరణలు అవసరం.

పంటల పండించే రైతుకు భూమిపై హక్కు కల్పించాలి. అంతేకాకుండా రైతులు పరపతి సౌకర్యాలను పొందడానికి వారికి భూమిపై హక్కు అవసరం. చిన్నకారు, సన్నకారు రైతులకు భూమి హక్కు తగిన భద్రతను కల్పించి ఉత్పాదకతను సాధించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పెద్దకమతాల కంటే చిన్నకమతాలను సమర్థంగా సాగు చేయవచ్చు.

భారత ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేయడానికి అనేక చట్టాలను రూపొందించింది. వాటిలో ముఖ్యమైనవి

  •  మధ్యవర్తుల తొలగింపు చట్టం
  •  కౌలుదారీ చట్టాలు
  •  భూగరిష్ఠ పరిమితి చట్టం
  • కమతాల సమీకరణ లేదా ఏకీకరణ

Reasons for failure of land Reforms (భూసంస్కరణల వైఫల్యాలకు కారణాలు)

భూసంస్కరణలు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో విజయవంతమయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో అమలులో జాప్యానికి, వైఫల్యాలకు కింది అంశాలను కారణాలుగా పేర్కొనవచ్చు.

  •  రాష్ట్రాల్లో చట్టాలు రూపొందించడంలో విపరీతమైన ఆలస్యం చేయడంతో భూముల బదలాయింపులు జరిగిపోయాయి. దీనివల్ల న్యాయంగా ఆశించినంత మిగులు భూమి సమకూరలేదు.
  •  చట్టాలు లోపభూయిష్టంగా ఉండటంతో న్యాయస్థానాల్లో కేసులు వేశారు. దాంతో జాప్యం జరిగింది.
  • మధ్యవర్తులైన జమీందార్లను తొలగించడంతో వారికి చెల్లించాల్సిన నష్ట పరిహారంపై న్యాయస్థానాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో భూసంస్కరణల వల్ల ఆశించిన ఫలితాలు అందలేదు.
  •  భూగరిష్ఠ పరిమితి చట్టంలో అనేక మినహాయింపులు ఇవ్వడంతో మిగులు భూమి తగ్గిపోయింది.
  •  చట్టాల అమలుకు అవసరమైన దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రభుత్వాలు భూసంస్కరణల పట్ల ఉదాసీన వైఖరిని ప్రదర్శించాయి.
  • ఉద్యోగస్వామ్య దృక్పథం, అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం, అవినీతి, అసమర్థత, రాజకీయ జోక్యం, లోపాయికారీ అక్రమాలు అడ్డుగోడలుగా మారాయి.
  •  సమాచార లోపం, రికార్డుల్లో లోపాలతో సంస్కరణల అమలు ఆలస్యమైంది.
  •  భూమి యజమానితో కౌలుదార్లు నిర్దిష్టమైన రాతపూర్వక ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల వారికి ప్రభుత్వం విధానాల కారణంగా రావాల్సిన కొన్ని రాయితీలు, పరపతి, బీమా లాంటి ప్రయోజనాలు అందలేదు.
  • జమీందారీ వ్యవస్థ అంతరించి అనుపస్థిత భూస్వాములు పెరిగారు. వారి వల్ల చాలా భూమి నిరుపయోగంగా ఉండిపోయింది.
  •  కమతాల సమీకరణ, సహకార వ్యవసాయం లాంటి విధానాలు విజయవంతం కాలేదు. దీనివల్ల వ్యవసాయాభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు దోహదపడే భారీస్థాయి వ్యవసాయం అమలుకు వీలు కాలేదు.
  • ప్రభుత్వం వివిధ ప్రణాళికల్లో అమలుచేసిన గ్రామీణాభివృద్ధి పథకాలు, పేదరిక నిర్మూలన, ఉపాధి పథకాల వల్ల ఉపాంత రైతులు, వ్యవసాయ శ్రామికులు లబ్ధి పొందారు. దాంతో వారి నుంచి భూసంస్కరణల అమలు కోసం ప్రభుత్వంపై తగినంత ఒత్తిడి రాలేదు.
  • కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల అమలును నిర్లక్ష్యం చేయడం వల్ల షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు సంబంధించి పంచాయతీ విస్తరణ చట్టం (పెసా) పరిధిలోని అనేక అంశాలు వెలుగుచూడలేదు. సామాజిక ఆస్తులు, వనరుల సర్వే చేపట్టడానికి శిక్షణ ద్వారా సమర్థ  నిర్మాణం చేయాల్సిన భూవినియోగ బోర్డుకు వనరులు లేక సాధికారతను పొందలేదు. గ్రామసభల సాధికారత జరగలేదు. భూసంబంధ విధానాలు కొరవడి మహిళల భూయాజమాన్య హక్కులు కూడా సాకారం కాలేదు.

నీతి ఆయోగ్‌ 2016లో మోడల్‌ అగ్రికల్చరల్‌ లాండ్‌ లీజింగ్‌ యాక్ట్‌ను రూపొందించింది. వివిధ రాష్ట్రాల్లో కౌలు చట్టాలను సమీక్షించడానికి నీతి ఆయోగ్‌ టి.హఖ్‌ అధ్యక్షతన ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఆన్‌ లాండ్‌ లీజింగ్‌ను ఏర్పాటు చేసింది. భూమి లేని ఉపాంత రైతులకు వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వడానికి ఉన్న అవకాశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఉపాంత రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిస్తుంది.

భూసేకరణ చట్టం – 2013 ను 2014 నుంచి అమలుచేశారు. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారమే భూసేకరణ జరుగుతోంది. భూరికార్డుల డిజిటలైజేషన్‌ కింద కర్ణాటకలో చేపట్టిన భూమి ప్రాజెక్టు ముఖ్యమైంది. రాజస్థాన్‌ ప్రభుత్వం 2016లో అర్బన్‌ లాండ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది.

Draft Land Reforms Act-2013 (భూ సంస్కరణల చట్టం ముసాయిదా-2013)

కేంద్ర ప్రభుత్వం 2013, ఆగస్టు 12న కొత్త భూసంస్కరణ చట్టం ముసాయిదాను తయారుచేసింది.

ఈ చట్టంలోని అంశాలు:

  • గ్రామాల్లో భూమి లేని పేదలందరికీ భూపంపిణీ చేయడం.
  •  దళితులు, గిరిజన వర్గాల నుంచి అన్యాయంగా తీసుకున్న భూములను తిరిగి ఇప్పించడం.
  •  లీజు చట్టం విధానాలను సడలించడం.
  •  భూమిపై మహిళల హక్కులను పెంచడం.

2015 డిసెంబరు నాటికి దేశంలో 6.7 మిలియన్‌ ఎకరాల భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించింది. ఇందులో 6.1 మిలియన్‌ ఎకరాలను స్వాధీనం చేసుకొని దానిలో 5.1 మిలియన్‌ ఎకరాలను 5.78 మిలియన్ల ప్రజలకు పంపిణీ చేసింది.

Land Reforms in India

Telangana – Dharani Portal (తెలంగాణ – ధరణి పోర్టల్‌)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020, అక్టోబరు 29న ప్రారంభించిన సంఘటిత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ ధరణి. ఇది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించినది. 2020, నవంబరు 23న వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ కూడా మొదలైంది. మా భూమి (ధరణి) ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ప్రజలు, పట్టాదారులు తమ భూముల వివరాలను నేరుగా తెలుసుకునే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. పహాణి (అడంగల్‌) ఆర్‌ఓఆర్‌. (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) డాక్యుమెంట్లను దీని ద్వారా పొందవచ్చు.

Andhra Pradesh – Bhudhar (ఆంధ్రప్రదేశ్‌ – భూధార్‌)

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015, జూన్‌ 13న ‘మీ భూమి’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది భూయజమానులు, పౌరులు తమ భూముల వివరాలు తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ సౌకర్యం. అయితే 8 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారాన్ని ఒకే చోట నుంచి తెలుసుకోవడానికి భూసేవ ప్రాధికార సంస్థను నెలకొల్పి దాని ద్వారా 2015 నవంబరులో ‘భూధార్‌ కార్యక్రమం’ను ప్రారంభించింది. ఆధార్‌లో ఉన్నట్లు  భూధార్‌ కూడా 11 అంకెలతో ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. అన్ని పత్రాల్లో భూధార్‌ను చట్టపరంగా ఉపయోగించడానికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ 2019, ఫిబ్రవరి 18న ఆమోదం తెలిపింది. ఈ తరహా ఏర్పాటు దేశంలోనే తొలిసారి జరిగింది. రెవెన్యూ పరిధిలోని 99.15% భూములకు శాశ్వత భూధార్‌ సంఖ్యలను కేటాయించారు.

Land Reform Laws in India 

Land plots (భూ కమతాలు)

వ్యవసాయ కమతం: రైతు సేద్యం చేసే భూమిని వ్యవసాయ కమతం అంటారు. ఒక ప్రాంతంలో సేద్యం చేసే భూ విస్తీర్ణాన్ని వ్యవసాయ కమతం అని, ఆ కమతంలో సాగయ్యే విస్తీర్ణాన్ని సాగు కమతం అంటారు. భూ కమతం అంటే ఒక రైతుకు సాగు చేసుకోవడానికి ఉన్న భూమి విస్తీర్ణం. కమతం అంటే భూమి, పొలం, చేను.

కమతం పరిమాణాన్ని అయిదు రకాలుగా వర్గీకరించారు.

1) ఉపాంత కమతం/ఉపాంత రైతు: ఒక హెక్టారు (సుమారు 2.5 ఎకరాలు) కంటే తక్కువ పరిమాణం ఉన్న వ్యవసాయ భూమిని ఉపాంత కమతం అంటారు. అలాంటి కమతాన్ని సాగు చేసే రైతులను ఉపాంత రైతులు అంటారు.

2) చిన్న కమతం: 1 నుంచి 2 హెక్టార్ల (2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు) మధ్య ఉన్న సాగు భూమిని చిన్న కమతం అంటారు. దీన్ని సాగు చేసే రైతులను చిన్నకారు రైతులు అంటారు.

3) చిన్న మధ్యస్థ కమతం: 2 నుంచి 4 హెక్టార్ల పరిమాణం ఉన్న కమతాన్ని చిన్న మధ్యస్థ కమతం అంటారు. వీటిని సాగు చేసే వారిని చిన్న మధ్యస్థ రైతులు అంటారు.

4) మధ్యస్థ కమతం: 4 నుంచి 10 హెక్టార్ల పరిమాణం ఉన్న కమతాన్ని మధ్యస్థ కమతం అంటారు. వాటిని సాగు చేసే రైతులను మధ్యస్థ రైతులు అంటారు.

5) పెద్దకమతం/భూస్వామి/పెద్ద రైతు:  10 హెక్టార్లు (25 ఎకరాలు), అంతకంటే ఎక్కువ ఉన్న రైతును భూస్వామి అంటారు.

భూసంస్కరణ చట్టాల అమలు మరియు లోపాలు, డౌన్లోడ్ PDF

pdpCourseImg

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

Why land reforms are taken?

Land reforms bring about social justice.