Table of Contents
AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the February Current affairs of AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh State Weekly Current Affairs
1. కర్ణాటక – ఏపీ ఆర్టీసీల ఒప్పందం కుదిరింది

ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కర్ణాటకలో నిత్యం 2.34 లక్షల కి.మీ. తిరిగేలా ఒప్పందం కుదిరింది. కర్ణాటక బస్సులు ఏపీలో నిత్యం 2.26 లక్షల కి.మీ. తిరగనున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, కేఎస్ఆర్టీసీ ఎండీ వి.అంబుకుమార్ విజయవాడలో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటి వరకు కర్ణాటకలో 1.65 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పేది. ఆ రాష్ట్ర బస్సులు ఏపీలో 1.56 లక్షల కి.మీ. తిరిగేవి. ఇప్పుడు కి.మీ. పెరగడంతో ఆ మేరకు బస్సులనూ పెంచనున్నారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత కర్ణాటకతో తొలిసారి ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది.
2. పోలీస్ డ్యూటీ మీట్లో ఏపీకి మూడో స్థానంలో నిలిచింది

మధ్యప్రదేశ్లోని భోపాల్లో అయిదు రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో మన రాష్ట్ర పోలీస్ శాఖ ఆరు పతకాలతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. వృత్తి నైపుణ్యంలో రెండు బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను అధికారులు పొందారు. స్వర్ణ పతక విజేతలకు రూ.10 వేలు, రజత పతకాలు పొందిన వారికి రూ.8 వేలు, కాంస్య పతకం సాధించిన అధికారికి రూ.5 వేలు చొప్పున నగదు బహుమతిని డీజీపీ అందించారు. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఈ పోలీస్ డ్యూటీమీట్ జరిగింది.
3. AP NGC కి ‘గోల్డ్ పార్ట్నర్ స్టేట్’ అవార్డు లభించింది

పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహనపెంచేందుకు ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ చేస్తున్న కృషికి ‘గోల్డ్ పార్ట్నర్ స్టేట్’ అవార్డు లభించిందని నేషనల్ గ్రీన్ కోర్ సమన్వయకర్త తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్మెంట్ విభాగం ఈ అవార్డు ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 పాఠశాలల్లో ఎకో క్లబ్బులు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
4. AP గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేసింది. మొత్తం 13 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో ఆరుగురు కొత్తవారు. ఏడుగురు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయ్యారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడబిదరిలో జన్మించారు. బాల్యం అంతా అక్కడే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన, మంగళూరు కొడియాల్బెయిల్ ఎస్డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు.
5. ఫోర్బ్స్ టాప్ 30 యువ సాధకుల జాబితాలో శివతేజకు చోటు దక్కించుకున్నారు.

డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన టాప్ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్ఈ మైనర్ డిగ్రీగా ఏకకాలంలో ఆయన పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్ అనే వైద్య సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని కొంత మంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో శివతేజ మెషీన్ లెర్నింగ్ టీమ్కు నాయకత్వం వహిస్తున్నారు. మెడికల్ ఇమేజింగ్లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.
6. వర్షిణికి ‘ఫిడే మాస్టర్’ టైటిల్ లభించింది

ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎం.సాహితీ వర్షిణి ‘ఫిడే మాస్టర్’ టైటిల్ లభించింది. ఇప్పటి వరకు ఉమన్ క్యాండిడేట్ మాస్టర్, ఉమన్ ఫిడే మాస్టర్, ఉమన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్స్ సాధించిన సాహితి వర్షిణి తాజాగా ‘ఫిడే మాస్టర్’ అయింది. ఏడాదిగా వివిధ టోర్నీల్లో ఆమె నిలకడగా రాణిస్తోంది. తండ్రి వద్దే శిక్షణ తీసుకుంటున్న వర్షిణి ఇప్పటి వరకు తొమ్మిది అంతర్జాతీయ పతకాలు సాధించారు.
7. కళా తపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు

కళా తపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీజీవితాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు.
తర్వాత ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్గా చేరారు. కొన్ని చిత్రాలకు కథా రచనలో పాలుపంచుకున్నారు. అలా రాణిస్తున్న సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తొలి చిత్రానికే నంది అవార్డు సాధించిన విశ్వనాథ్, తన సినీప్రయాణంలో సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు లాంటి అనేక ఆణిముత్యాలను అందించి తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారు. విశ్వనాథ్కు 1992లో పద్మశ్రీ, 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వచ్చాయి. అదే ఏడాది రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది. నంది, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.1980 ఫిబ్రవరి 2న శంకరాభరణం సినిమా విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ఆయన మరణించడం యాదృచ్ఛికం.
Telangana State Weekly Current Affairs
1. అంకుర సంస్థల ఏర్పాటులో 8వ స్థానంలో తెలంగాణ నిలిచింది

అంకుర సంస్థల (స్టార్టప్) ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ బిహార్ కంటే దిగువ స్థాయిలో నిలిచింది. 2022 డిసెంబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 86,713 స్టార్టప్లు ఏర్పాటవగా వాటిలో 1,341 అంకురాలతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి పరిమితమైంది. 4,566 స్టార్టప్లతో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాలను మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్ ఆక్రమించాయి. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్రం ప్రకటించిన స్టేట్స్ స్టార్టప్స్ ర్యాంకింగ్ ఎక్సైజ్ – 2022లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్గా 7వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 29వ స్థానానికి పరిమితమైంది.
2. అత్యుత్తమ పోలీస్స్టేషన్గా దుండిగల్ ఠాణా ఎంపికైంది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ఠాణాగా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేస్తుంది. 2022కు గాను దుండిగల్ ఠాణా తెలంగాణలో తొలి ర్యాంకు సాధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, మేడ్చల్ డీసీపీ సందీప్, దుండిగల్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డిలకు హైదరాబాద్లో అందించారు.
3. ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు

2023 – 24 ఆర్థిక సంవత్సరపు తెలంగాణ రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. శాసనసభ, మండలి ఆమోదించిన రెండు బిల్లులకు సంబంధించిన దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. ఫిబ్రవరి 12న శాసనసభ, మండలి బిల్లుకు ఆమోదం తెలపగా, 13న గవర్నర్కు ప్రభుత్వం పంపింది. ఒకరోజు వ్యవధిలోనే గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లుపై తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించేందుకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
4. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 46 శాతం మందికి ఉపాధి పెరగనుంది

తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరులు, ఉపాధి, ఇతర అంశాలపై అధ్యయన వివరాలను ఈ నివేదికలో వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 65 లక్షల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమేపీ పెరిగి 2021 – 22 నాటికి 1.5 కోట్లకు చేరింది. వీరిలో అత్యధికంగా 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు, అనుబంధ వృత్తులు, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం తదితర రంగాల్లో వారు పనిచేస్తున్నారు. తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం ఉంది. ఔషధ, ఇంధన, రసాయన, జౌళి, తయారీ పరిశ్రమల్లో 11 శాతం, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఆతిథ్యం, ఇతర వాణిజ్య, సేవా రంగాల్లో 11 శాతం మంది ఉన్నారు. నిర్మాణ, రవాణా రంగాల్లో 9 శాతం మంది చొప్పున పనిచేస్తున్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో 5 శాతం, ఆర్థిక సేవల రంగాల్లోనూ 5 శాతం మంది ఉపాధి పొందుతున్నారు. ఐటీ, అనుబంధ వృత్తుల్లో 3 శాతం, గనులు, విద్యుత్, ఇతర రంగాల్లో ఒక శాతం మంది ఉపాధి పొందుతున్నారని నివేదిక వెల్లడించింది.
5. తెలంగాణలో తలసరి ఆదాయంలో 15 శాతం వృద్ధి రేటు నమోదు అయ్యింది

తెలంగాణ రాష్ట్రంలో 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.3,17,115గా ప్రభుత్వం అంచనా వేసింది. మొదటిసారిగా తలసరి ఆదాయం రూ.3 లక్షలను దాటగా గత ఏడాది కంటే 15 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఈ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో వెల్లడించారు. గత ఏడాది, రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.2,75,443గా అంచనా వేశారు. ప్రాథమిక అంచనాల మేరకు గత ఏడాదికంటే ఈసారి తలసరి ఆదాయం రూ.41,672 పెరిగింది.
6. బొగ్గు రవాణాలో కొత్త రికార్డు నమోదయ్యింది

గత నెలలో 68.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని, 68.4 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో కొత్త రికార్డు నమోదైందని సింగరేణి సంస్థ తెలిపింది. 2016 మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటి వరకు నెలవారీ గరిష్ఠ రవాణా రికార్డు అని వివరించింది. ఉపరితల గనుల్లో రోజువారీ మట్టి తొలగింపులో కూడా గత నెల 31న అత్యధికంగా 16.67 లక్షల క్యూబిక్ మీటర్లను తొలగించి రికార్డు సృష్టించినట్లు పేర్కొంది.
7. తొలిసారిగా ఫిబ్రవరిలోనే తెలంగాణ బడ్జెట్ సమావేశాల ముగింపు జరిగింది

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండో వారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఫిబ్రవరి 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 6న ఉభయసభల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా తర్వాత ఆరు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్ అకౌంట్ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది.
8. తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2022 – 23 విడుదల చేశారు

ఆర్థికమాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ యావద్దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి…‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకొనే స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్రం ఆటంకాలు కల్పిస్తున్నా గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. శాంతిభద్రతల సమర్థ నిర్వహణతో దేశంలోనే ఎక్కడా లేనిరీతిలో పెట్టుబడులు సాధ్యమయ్యాయన్నారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేను విడుదల చేశారు.
9. రూ.2,90,396 కోట్లతో 2023 – 24 తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు

సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 – 24 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సుమారు ఇరవై శాతం నిధులను సబ్బండ వర్గాల సంక్షేమానికి కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కాయి. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్కు నిధుల కేటాయింపులో పెద్దపీట వేసింది. పేదల గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పథకాల జోలికి పోకున్నా ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ నిధులను కేటాయించింది. 2018 ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేసేందుకు వీలుగా నిధులను కేటాయించింది. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల వాటాను పెంచింది.
10. ఆచార్య పెన్నా మధుసూదన్కు ముదిగంటి గోపాల్రెడ్డి పురస్కారం లభించింది

రచయిత్రి, పరిశోధకురాలు డా.ముదిగంటి సుజాతారెడ్డి ఏర్పాటు చేసిన ఆచార్య ముదిగంటి గోపాల్రెడ్డి స్మారక పురస్కారానికి ఆచార్య పెన్నా మధుసూదన్ ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ఆచార్య పెన్నా మధుసూదన్, నాగ్పుర్ రాంటెక్లోని కవికుల గురువు కాళీదాసు సంస్కృత విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఫిబ్రవరి 21న హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో ఆయనకు పురస్కారం అందజేయనున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. మధుసూదన్ ఇప్పటి వరకు కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.
11. తెలంగాణలో మెరుగైన పారిశ్రామిక విధానం

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందనీ, టీఎస్ఐపాస్ వంటి మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీ) 25వ జాతీయ సదస్సు మాదాపూర్లోని హెచ్ఐసీసీలో జరిగింది. ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచానికి అవసరమైన టీకాల్లో మూడో వంతు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తూ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ పేరు గడించిందన్నారు. గడిచిన ఎనిమిదేళ్లల్లో 7.7 శాతం పచ్చదనం పెంపొందించి, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామనీ, ఐటీ ఎగుమతుల్లో, వ్యవసాయ రంగంలో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు.
12. ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు సత్తాచాటారు

ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే 800 మీటర్ల ఫ్రీస్టైల్లో పసిడి నెగ్గిన ఆమె 400 మీ. ఫ్రీస్టైల్లో రజతం సొంతం చేసుకుంది. 4 నిమిషాల 39.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. పురుషుల 400 మీ. వ్యక్తిగత మెడ్లీలో సాయి నిహార్ (4:43.81ని) కాంస్యం కైవసం చేసుకున్నారు. యుగ్ (రాజస్థాన్ – 4:38.12 ని), శుభోజిత్ (బెంగాల్ – 4:40.69 ని) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. రోయింగ్ క్వాడ్రపుల్ స్కల్ విభాగంలో తెలంగాణకు కాంస్యం దక్కింది. శ్రావణ్ కుమార్, సాయి వరుణ్, గణేశ్, జ్ఞానేశ్వర్తో కూడిన జట్టు 3 నిమిషాల 31.28 సెకన్లలో రేసు ముగించి మూడో స్థానంలో నిలిచారు
కయాకిగ్ – కనోయింగ్లో తెలంగాణ ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించారు. 1000 మీటర్ల రేసులో ప్రదీప్ – అభయ్ రజతం, మహేంద్ర సింగ్ – కునాల్ కాంస్య పతకాలు నెగ్గారు. మూడో స్థానంలో నిలిచిన అమిత్ కుమార్ కాంస్యం గెలిచారు
13. తెలంగాణలో ఆదిమానవుని వర్ణ చిత్రాలను గుర్తించారు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో బృందం సభ్యులు చిత్తరిగుట్టను పరిశీలించారు. అక్కడ కొత్త రాతియుగపు మూపురం ఉన్న ఎద్దు బొమ్మలు ఆరు, ఒక అడవి పంది, రెండు జింకలు, ఇద్దరు మనుషుల బొమ్మలున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. ఎర్రజాబు రంగుతో, రేఖా చిత్ర రీతిలో గీచిన ఈ బొమ్మలు ఆనాటి మానవుల చిత్ర కళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. గుట్ట దిగువన సూక్ష్మరాతి పనిముట్లు, కొత్త రాతియుగపు రాతి గొడ్డలి, గొడ్డళ్లను అరగదీసిన గుంటలను కూడా గుర్తించామని, ఈ ఆధారాల వల్ల ఈ వర్ణ చిత్రాలు కీ.పూ 8 వేలు- 4 వేల సంవత్సరాలకు చెందినవిగా తెలుస్తోందన్నారు.
14. తెలంగాణకు చెందిన తేజ మిరప అనేక దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది.

తెలంగాణలోని రెండవ అతిపెద్ద మిర్చి మార్కెట్ యార్డ్గా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎగుమతి మార్కెట్లో ప్రసిద్ధి చెందిన తేజా రకం ఎర్ర మిర్చి, దాని పాక, ఔషధ మరియు ఇతర విస్తృత ఉపయోగాలకు ప్రసిద్ధి చెందింది. తేజా ఎర్ర మిరపకాయ అనేక దేశాలలో హాట్ ప్రాపర్టీగా మారింది మరియు ఈ రకమైన ఎర్ర మిరపకాయ ఎగుమతి ప్రస్తుతం సంవత్సరానికి ₹2,000 కోట్ల నుండి రాబోయే సంవత్సరంలో ₹2,500 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.
తేజ మిరప అనేది గుంటూరు మిరప యొక్క చక్కటి రకం, ఇది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. తేజా మిర్చి గుంటూరు మిర్చిలో ఒక చక్కని రకం. గుంటూరు సన్నం – S4 రకం మిరపకాయలలో అత్యంత ప్రసిద్ధి చెందిన రకం మరియు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, ప్రకాశం, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో విస్తారంగా పెరుగుతుంది. నూరిన మిరపకాయ చర్మం మందంగా, ఎర్రగా, వేడిగా ఉంటుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |