Andhra Pradesh is at the top in capital expenditure | మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూలధన వ్యయంపై CAG గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు CAG గణాంకాలు తెలిపాయి.
CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాల ప్రకారం, తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా పెద్దగా పెట్టుబడులు పెట్టలేదు. పలు రాష్ట్రాలు బడ్జెట్ లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేశాయనే అంశాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మూలధన కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని నివేదిక ప్రత్యేకంగా పేర్కొంది. బడ్జెట్ లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.12,669 కోట్లు పంపిణీ చేసిందని, బడ్జెట్లో మూలధన వ్యయం కోసం కేటాయించిన రూ.31,061 కోట్లలో ఇది 40.79 శాతం అని స్పష్టం చేసింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా గణనీయమైన వ్యయాన్ని చూపించాయి. మూలధన వ్యయం అంటే నేరుగా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు.